TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part VIII
2015-16 రాష్ట్ర బడ్జెట్
* ఆదాయ వ్యయాల లెక్కలివీ..
- ఒక ఏడాది రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు ప్రణాళికను స్పష్టమైన గణాంకాలతో చేసే కూర్పు రాష్ట్ర బడ్జెట్. ఆ రాష్ట్రానికి ఏడాది (ఆర్థిక సంవత్సరం)లో వచ్చే ఆదాయం, చేయాల్సిన ఖర్చులతో కూడిన అంచనాలు, ప్రతిపాదనలన్నీ సమగ్రంగా రూపకల్పన చేస్తారు. ఆర్థికమంత్రి ఆధ్వర్యంలో బడ్జెట్ తయారవుతుంది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను తొలిసారి ఈ ఏడాది మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రాంతీయ వర్తమాన అంశాల్లో భాగంగా.. టీఎస్పీఎస్సీ పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు తెలంగాణ బడ్జెట్ 2015-16ను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. రాష్ట్ర విధానాలపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలను గుర్తించేందుకు ఈ సన్నద్ధత సహకరిస్తుంది.
- తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ 2015, మార్చి 11న శాసనసభలో ప్రవేశపెట్టారు. 2015-16 సంవత్సరానికి గాను మొత్తం బడ్జెట్ వ్యయాన్ని రూ.1,15,689 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.52,383 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.63,306 కోట్లుగా అంచనా వేశారు.
రెవెన్యూ ఆదాయ, వ్యయాలు
* రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రాబడులు రూ.94,131.51 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ.93,600.21 కోట్లు. రెవెన్యూ మిగులును రూ.531.30 కోట్లుగా అంచనా వేశారు.
* రాష్ట్రానికి అత్యధిక పన్ను ఆదాయం వ్యాట్ (అమ్మకం పన్ను) నుంచి లభిస్తోంది. ఈ ఆదాయం రూ.35,463.39 కోట్లు. తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ పన్ను నుంచి రూ.3,916.43 కోట్లు; స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల నుంచి రూ.3,700 కోట్లు లభిస్తోంది.
* 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. దీని ప్రకారం.. కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.12,823.25 కోట్లు లభిస్తాయి. ఇది రాష్ట్ర మొత్తం రెవెన్యూ రాబడిలో 14 శాతం.
* కేంద్రం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద రాష్ట్రానికి రూ.12,400.24 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇది రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 13 శాతం.
* రెవెన్యూ రాబడుల్లో అత్యధికంగా 74 శాతం ఆదాయాన్ని అభివృద్ధి వ్యయం కింద ఖర్చు చేయనున్నారు.
నికర లోటు – 3.12 కోట్లు
* 2015-16 సంవత్సరపు బడ్జెట్లో నికర లోటు రూ.3.12 కోట్లుగా ఉంది. అయితే బడ్జెట్ ప్రారంభ నిల్వ రూ.5.52 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ రూ.2.40 కోట్ల మిగులుతో ఉంటుంది.
* స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో ద్రవ్యలోటు 3.49 శాతంగా ఉంది. ఇది ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం 3 శాతానికి మించకూడదు. అయితే 14వ ఆర్థిక సంఘం నిర్దేశిత నిబంధనలకు లోబడి జీఎస్డీపీలో 0.5 శాతం మేర అప్పులను అదనంగా తెచ్చుకోవడానికి కేంద్రం రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని సూచించింది. దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
* 2014, జూన్ 1 నాటికి తెలంగాణ రాష్ట్రవాటాగా ఉన్న ప్రజా రుణం రూ.61,711.50 కోట్లుగా ఉంది.
* 2015-16 బడ్జెట్ కేటాయింపుల్లో షెడ్యూల్డ్ కులాల సబ్ప్లాన్ కింద రూ.8,089 కోట్లు, షెడ్యూల్డ్ తెగల సబ్ప్లాన్ కింద రూ.5,036 కోట్లు ప్రతిపాదించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ ప్రణాళికా వ్యయంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల కింద నిధులు కేటయిస్తున్నాయి.
సంక్షేమ పథకాలు – కేటాయింపులు
రైతు రుణమాఫీ
- రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 36.33 లక్షల మందికి సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందులో భాగంగా 2014-15 బడ్జెట్ కింద రూ.4,250 కోట్లు విడుదల చేశారు. 2015-16 బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ.4,250 కోట్లు ప్రతిపాదించారు.
భూమి కొనుగోలు పథకం
- నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాలను మూడు ఎకరాల ఆసాములుగా చేయడానికి ఉద్దేశించి ప్రభుత్వం భూమి కొనుగోలు పథకాన్ని 2014, ఆగస్టు 15న ప్రారంభించింది. ఈ పథకం కింద 2015 జనవరి నాటికి 525 మంది లబ్దిదారులకు 1,132 ఎకరాల ప్రైవేటు భూమి, 270 ఎకరాల ప్రభుత్వ భూమిని పంపిణీ చేశారు. దీనికోసం 2015-16 బడ్జెట్లో రూ.1000 కోట్లు ప్రతిపాదించారు.
ఆసరా
- వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత పనివారు, గీత కార్మికులు, హెచ్ఐవీ ఎయిడ్స్ రోగులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ‘ఆసరా’ సామాజిక భద్రత పింఛన్ల కార్యక్రమాన్ని 2014, నవంబరు 8న ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, చేనేత పనివారు, గీత కార్మికులు, హెచ్ఐవీ ఎయిడ్స్ రోగులకు నెలకు రూ.1000; వికలాంగులకు నెలకు రూ.1500 అందిస్తున్నారు. 2015-16 బడ్జెట్లో ఈ పథకం కోసం రూ.4,000 కోట్లు కేటాయించారు. 2015 మార్చి నుంచి ఆసరా పథకం కింద బీడీ కార్మికులకు నెలకు రూ.1000 జీవనభృతి కింద అందిస్తారు. దీనికోసం 2015-16 బడ్జెట్లో రూ.188 కోట్లు ప్రతిపాదించారు.
ఆహార భద్రత
- ఆహార భద్రత కార్డులు ఉన్నవారిలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల బియ్యం (కిలో ఒక రూపాయికి సబ్సిడీ కింద) వంతున 2015, జనవరి 1 నుంచి అందజేస్తున్నారు.
- రేషన్ బియ్యం, పింఛన్లు లాంటి పథకాల ద్వారా మరింత మందికి లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఆదాయ పరిమితులను సవరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి రూ.1,50,000 వేలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచింది. అలాగే కుటుంబం యూనిట్గా పరిగణించే కమతం పరిమాణాన్ని మాగాణి భూమి అయితే 2.5 నుంచి 3.5 ఎకరాలకు, మెట్ట భూమి అయితే 5 నుంచి 7.5 ఎకరాలకు పెంచారు. ఈ ఆదాయ, భూకమతం పరిమితులకు లోబడి ఉన్నవారు ఆహార భద్రతకు అర్హులు. ఈ పథకం కింద 2.8 కోట్ల మంది లబ్ది పొందుతున్నారు.
- 2,757 వసతి గృహాల్లోని 4.81 లక్షల మంది విద్యార్థులు, 34,319 పాఠశాలల్లోని 29.86 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం 2015, జనవరి 1 నుంచి ‘సన్న బియ్యం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
- 2015-16 బడ్జెట్లో ప్రభుత్వం ఆహార భద్రత, సబ్సిడీ కోసం రూ.2,200 కోట్లు ప్రతిపాదించింది.
వాటర్ గ్రిడ్
- ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీటిని అందించడానికి ఉద్దేశించిన ‘తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్ గ్రిడ్)’ కు 2015-16 బడ్జెట్లో రూ.4,000 కోట్లు కేటయించారు.
రహదారుల అభివృద్ధి
- రహదారులు, భవనాల శాఖ కింద రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ – మరమ్మతుల కోసం బడ్జెట్లో రూ.4,980 కోట్లు కేటాయించారు. పంచాయతీ రోడ్ల కోసం రూ.2,421 కోట్లు కేటాయించారు.
మిషన్ కాకతీయ
- ఈ కార్యక్రమం కింద అయిదేళ్లలో 46,531 చెరువులను బాగుచేస్తారు. ప్రతి సంవత్సరం 20 శాతం చెరువులను ఎంపిక చేసి పునరుద్ధరిస్తారు. 2014-15 సంవత్సరంలో 9,305 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015-16లో 9,308 చెరువులను ఎంపిక చేశారు. 2015-16 బడ్జెట్లో ‘మిషన్ కాకతీయ’ కోసం రూ.2,083 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్కు ప్రత్యేకం
- హైదరాబాద్ మెట్రో రైలు కోసం రూ.416 కోట్లు కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు బడ్జెట్లో రూ.526 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లో తాగునీటి కోసం ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూ అండ్ ఎస్బీ)’కి రూ.1000 కోట్లు కేటాయించారు.
హరితహారం
- ఈ పథకానికి 2015-16 బడ్జెట్లో రూ.325 కోట్లు కేటాయించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలోని అడవుల విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడం ఈ పథకం ఉద్దేశం.
108 వాహనాల పెంపు
- రాష్ట్రంలో 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసు వాహనాలను ప్రస్తుతం ఉన్న 337 నుంచి 2015-16 సంవత్సరంలో 506కి పెంచనున్నారు.
మాదిరి ప్రశ్నలు
1. 2015-16 రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూ మిగులును ఎంతగా (రూ. కోట్లలో) అంచనా వేశారు?
ఎ) 231.30 బి) 331.30 సి) 431.30 డి) 531.30
జ: (డి)
2. రాష్ట్రానికి అత్యధిక పన్ను ఆదాయం కిందివాటిలో దేనిద్వారా లభిస్తోంది?
ఎ) అమ్మకపు పన్ను బి) స్టేట్ ఎక్సైజ్ సి) స్టాంప్స్, రిజిస్ట్రేషన్లు డి) వాహనాలపై పన్ను
జ: (ఎ)
3. రెవెన్యూ రాబడుల్లో భాగంగా 2015-16లో కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు?(రూ. కోట్లలో)
ఎ) 11,823.25 బి) 12,823.25 సి) 13,823.25 డి) 14,823.25
జ: (బి)
4. 2015-16 బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఎంత కేటాయించారు? (రూ. కోట్లలో)
ఎ) 8,500 బి) 7,400 సి) 8,432 డి) 4,932
జ: (సి)
5. ‘షెడ్యూల్డ్ కులాల సబ్ప్లాన్’కు 2015-16 బడ్జెట్లో ఎంత మొత్తాన్ని ప్రతిపాదించారు?(రూ. కోట్లలో)
ఎ) 8,089 బి) 8,559 సి) 9,089 డి) 8,500
జ: (ఎ)
6. రెండో విడత రైతు రుణమాఫీ కోసం బడ్జెట్లో ఎంత (రూ. కోట్లలో) కేటాయించారు?
ఎ) 3,250 బి) 4,250 సి) 5,250 డి) 6,250
జ: (బి)
7. ప్రాధాన్య కుటుంబాలుగా గుర్తింపు పొందేందుకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలను నిర్ణయించే ఆదాయ పరిమితులను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. గుర్తింపు పొందిన ప్రాధాన్య కుటుంబాలు ఆహార భద్రత, పెన్షన్లు లాంటి పథకాలకు అర్హత పొందుతాయి. ఈ పరిమితులకు సంబంధించి కిందివాటిలో ఏది సరైంది?
ఎ) గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయాన్ని రూ.60,000 నుంచి రూ.1,50,000కి పెంచారు.
బి) పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయాన్ని రూ.75,000 నుంచి రూ.2 లక్షలకు పెంచారు.
సి) కుటుంబ భూపరిమితిని సడలించి మాగాణి భూమిని 2.5 నుంచి 3.5 ఎకరాలకు; మెట్టభూమిని 5 నుంచి 7.5 ఎకరాలకు పెంచారు.
డి) పైవన్నీ
జ: (డి)
8. 2015-16 బడ్జెట్లో ఆహార భద్రత పథకం సబ్సిడీ కోసం ఎంత కేటాయించారు? (రూ. కోట్లలో)
ఎ) 1,200 బి) 1,800 సి) 2,200 డి) 3,200
జ: (సి)
9. 2015-16 బడ్జెట్లో ‘విత్త లోటు’ను ఎంతగా అంచనా వేశారు? (రూ. కోట్లలో)
ఎ) 21,554 బి) 15,892 సి) 9,414 డి) 16,969
జ: (డి)
10. ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేయడం కోసం ఉద్దేశించిన ‘తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్ గ్రిడ్)’కు 2015-16 బడ్జెట్లో ఎంత కేటాయించారు? (రూ. కోట్లలో)
ఎ) 4,000 బి) 6,000 సి) 7,000 డి) 8,000
జ: (ఎ)
Leave a Reply